Authorization
Wed March 19, 2025 01:02:48 pm
- పరిణతవాణి ప్రసంగంలో విహారి
నవతెలంగాణ-సుల్తాన్బజార్
సాహిత్యంలో విమర్శ, అనువాదాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ప్రముఖ కథా రచయిత, విమర్శకులు విహారి అన్నారు. కథల్లో స్థానికత, సమకాలీనత, సామాజికత చోటు చేసుకుంటున్నదన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో జరుగుతున్న పరిణతవాణి ప్రసంగ పరంపరలో శుక్రవారం ఆయన 104వ ప్రసంగం చేశారు. కథానిక, కవితా ప్రక్రియల్లో రచనలు విరివిగా ప్రచురించడానికి పత్రికలు, ప్రసార మాధ్యమాలే కాకుండా వెబ్ మ్యాగజైన్స్, బ్లాగులు, ఇతర సామాజిక మాధ్యమాలు వేదికలుగా నిలుస్తున్నాయని చెప్పారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ విహారి కలంపేరు కలిగిన జె.ఎస్.మూర్తి కథా, నవలా రచయితగా, విమర్శకునిగా సుమారు 60 ఏండ్లుగా కృషి చేస్తున్నారని అన్నారు. 350కి పైగా కథలు, 5 నవలలు, 15 విమర్శన వ్యాస, 5 వచన కవితా, 2 పద్య కవితా సంపుటాలు, రచనలు అందించారని తెలిపారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా. జె. చెన్నయ్య స్వాగతోపన్యాసం చేశారు.