Authorization
Wed May 07, 2025 01:17:00 am
- 18న జరిగే చర్చలో గతంలో ఇచ్చిన హామీలపై
- ఒప్పందం చేసి అమలు చేయాలి
- లేనియెడల నిరవధిక సమ్మెకు
- కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధం కావాలని జేఏసీ పిలుపు
నవతెంలగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత, చట్టబద్ద హక్కులు, సౌకర్యాలు అమలు చేయాలని తదితర సమస్యల పరిష్కారానికై గతంలో ఇచ్చిన సమ్మె డిమాండ్లను తక్షణమే యాజమాన్యం పరిష్కరించాలని, లేనియెడల సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు వెల్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. జేఏసీ ఆధ్వర్యంలో చేసిన దశలవారీ పోరాటాల ఫలితంగా ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చర్చలలో గతంలో ఫిబ్రవరి 9వ తేదీన ఇచ్చిన హామీలుపై ఒప్పందం చేసి తక్షణమే అమలు చేయాలని, పెండింగ్ సమస్యలపై నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారానికి సిద్ధం కావాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల ఆవేదన, అరకొర వేతనాలతో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను సింగరేణి యాజమాన్యం, లేబర్ అధికారులు పరిగణలోకి తీసుకోవాలని, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తే కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని నాయకులు పిలుపు నిచ్చారు. కొత్తగూడెం శేషగిరి భవన్లో పి.రామచందర్ అధ్యక్షతన రాష్ట్ర జేఏసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఏఐటీయూసీ నుండి గుత్తుల సత్యనారాయణ, పి రామచందర్, సీఐటీయు నుండి యార్రగాని కృష్ణయ్య, ఐఎఫ్టియు నుండి ఎ.వెంకన్న, యన్. సంజీవ్, ఐయన్టీయుసి నుండి కాలం నాగభూషణం, ఐఎఫ్టియు నుండి డి.బ్రహ్మనందం, కె. సురేందర్, మరో ఐఎఫ్టియు నుండి ఎల్.విశ్వనాథం నాయకులు ఆర్.మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.