Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : 500 ఏండ్ల నాటి పురాతన హనుమాన్ విగ్రహం అమెరికా నుంచి భారత్కు చేరనుంది. ఈ మేరకు విగ్రహాన్ని భారత్కు అప్పగించినట్టు అమెరికా వెల్లడించింది. బుధవారం అమెరికా విదేశాంగ శాఖ వాషింగ్టన్లోని బెంజిమన్ ఫ్రాంక్లిన్ రూమ్లో దీపావళి వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్కృతులకు సాయం చేయడం ద్వారా తమ ప్రభుత్వం విభిన్న మతాలకు సహకరిస్తోందని తెలిపారు. సంస్కృతిని కాపాడేందుకు, దెబ్బతిన్న చారిత్రక భవనాలను రక్షించేందుకు, దొంగతనాలకు గురైనా చారిత్రక సంపదను తిరిగి సంపాదించేందుకు అమెరికా రాయబారులు సహకరిస్తారన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, భారత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కలిసి 500 ఏండ్ల పురాతనమైన హనుమాన్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు. దానిని భారత ప్రభుత్వానికి అప్పగించినట్టు చెప్పారు.
దక్షిణ భారత్లోని ఓ ఆలయంలోని 500 ఏండ్ల నాటి హనుమాన్ విగ్రహాన్ని దొంగిలించి అమెరికాలోకి క్రిస్టీ ఆక్షన్ హౌస్కు విక్రయించారు. ఆ సంస్థ దానిని వేలంలో ఉంచగా ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే ఆక్షన్ సంస్థకు, ఆస్ట్రేలియాలోని కొనుగోలుదారుడికి ఆ విగ్రహం దొంగిలించినట్లు తెలియదు. కానీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్రమత్తం చేయడంతో ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొనేందుకు వారు పూర్తిగా సహకరించారని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఆస్ట్రేలియాలో స్వాధీనం చేసుకొన్న ఈ విగ్రహాన్ని అప్పట్లో అమెరికాకు అప్పగించారు. తాజాగా ఇప్పుడు ఆ విగ్రహం భారత్కు చేరనుంది.