Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రైలు కింద పడి ఓ ట్రాఫిక్ ప్రొబేషనరీ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని మౌలాలి సమీపంలోని రైల్వేట్రాక్పై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కోటబమ్మాళి మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన రమణ(26) 2020లో పోలీస్శాఖలో ట్రైనీ ఎస్ఐగా విధుల్లో చేరారు. ప్రస్తుతం ట్రాఫిక్ ప్రొబేషనరీ ఎస్ఐగా ఉంటూ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఎసై ప్రతాప్, ముగ్గురు స్నేహితులతో కలిసి చిక్కడపల్లి అశోక్నగర్లో ఆయన నివాసముంటున్నారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో రమణ పని ఉందంటూ బయటకు వెళ్లారు. అయితే గురువారం ఉదయం మౌలాలి-చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య బీ క్యాబీన్ ప్రాంతంలో రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం ఉండడం రైల్వే కీమ్యాన్ వెంకటేశ్వర్రావు గుర్తించారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అధికారుల ద్వారా జీఆర్పీ పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఉన్న సెల్ఫోన్ ఆధారంగా మృతుడిని ఎస్ఐ రమణగా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం అందించి, అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ సీఐ ఎం.శ్రీను తెలిపారు.