Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పెండ్లయిన మహిళకు ఇంటి పనులు చేయాలని చెప్పడం క్రూరత్వం కిందకు రాదని బాంబే హైకోర్టు పేర్కొంది. ఇంటి పనులు చేయాలని చెబితే పనిమనిషితో పోల్చడం సరికాదని చెబుతూ విడిపోయిన భర్త, అతడి తల్లిదండ్రులపై ఓ మహిళ పెట్టిన గృహహింస కేసును కోర్టు కొట్టివేసింది.
పూర్తి వివరాల్లోకెళ్తే.. పెండ్లయిన నెల రోజుల తర్వాత భర్త తనను పనిమనిషిలా చూడడం ప్రారంభించాడని, కారు కొనుక్కునేందుకు రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతోపాటు మానసికంగా, భౌతికంగా వేధించాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును తాజాగా బాంబే హైకోర్టులో ఔరంగాబాద్ బెంచ్ విచారించింది. పెండ్లయిన మహిళను ఇంటి పనులు చేయాలని అడగడం అంటే అది కచ్చితంగా కుటుంబం కోసమే అవుతుందని, దానిని పనిమనిషి చేసే పనితో పోల్చడం సరికాదని బెంచ్ ఈ సందర్భంగా తెలిపింది. ఇంటి పనులు చేయడం ఆమెకు ఇష్టం లేకుంటే ఆ విషయాన్ని పెండ్లికి ముందే చెప్పి ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. తనను మానసికంగా, భౌతికంగా వేధించారని ఫిర్యాదుదారు ఆరోపించినప్పటికీ అందుకు తగిన ఆధారాలను చూపించలేకపో యారని.. సెక్షన్ 498ఎ ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన గృహహింస కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.