Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూరజ్కుండ్ : సుదీర్ఘ ప్రసంగం చేసినందుకు హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ వేదికపైనే అసహనం వ్యక్తం చేశారు. హర్యానాలోని సూరజ్కుండ్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన వర్క్షాప్ను అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ ఎనిమిదిన్నర నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. దాంతో అమిత్ షా ఆయనకు నాలుగుసార్లు అంతరాయం కలిగించారు. మాట్లాడేందుకు ఆయనకు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు.
హర్యానా చరిత్ర, హరిత విప్లవానికి దాని సహకారం, ఒలింపిక్స్లో రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభ, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన క్రీడా మౌలిక సదుపాయాల గురించి హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ వివరించసాగారు. అలాగే, తన మంత్రి శాఖ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే ఫిర్యాదుల పరిష్కార సెషన్ గురించి కూడా మాట్లాడారు. అయితే వేదికపైనే ఉన్న అమిత్ షా.. తొందరగా ప్రసంగం ముగించాలని సదరు మంత్రికి ఒక నోట్ పంపారు. కానీ విజ్ పట్టించుకోకుండా ప్రసంగం కొనసాగించారు. దాంతో మైక్ ఆన్ చేసిన అమిత్ షా.. విజ్ కు సైగ చేశారు. అయినా రాష్ట్ర హోంమంత్రి ప్రసంగం ఆపలేదు. చివరకు అమిత్ షా కల్పించుకొని అనిల్ జీ మీకు ఐదు నిమిషాలు మాత్రమే ఇచ్చారని.. ఇప్పటిక ఎనిమిదిన్నర నిమిషాలు మాట్లాడారని చెప్పారు. దయచేసి ముగించాలని.. ఇంత సుదీర్ఘంగా మాట్లాడేందుకు ఇది వేదిక కాదు అని చెప్పారు. అయితే అనిల్ విజ్ ఇంకాస్త సమయం అడిగారు. అందుకు షా అంగీకరించడంతో విజ్ తమ రాష్ట్ర విజయాల సుదీర్ఘ జాబితాను వివరిస్తూ ఉన్నారు. దాంతో, అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'అనిల్ జీ దయచేసి నన్ను క్షమించడి. ఇది పని చేయదు. ముగించండి అని చెప్పారు. అక్కడితో ఆగకుండా విజ్ ముంగిపు వ్యాఖ్యలు చెప్పడం మొదలు పెట్టడంతో అమిత్ షా మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిపోయింది.. సమావేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అని గట్టిగా చెప్పారు. షా స్పందన తర్వాత హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మూడు నిమిషాల్లో తన ప్రసంగాన్ని మూడు నిమిషాల్లో ముగించడం గమనార్హం.