Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో చోటుచేసుకున్నఈ కేసుపై టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏసీబీ చేత విచారణ చేయించినా, లేదంటే టీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్లుగా కేంద్రంలో అధికారంలో ఎన్న బీజేపీ చెప్పు చేతల్లో ఉన్న సీబీఐ చేత విచారణ చేయించినా అసలు వాస్తవాలు బయటకు రావని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసులో అసలు నిజాలు బయటకు రావాలంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీ చేత విచారణ చేయించడమొక్కటే మార్గమని ఆయన అన్నారు. ఈ మేరకు శనివారం మునుగోడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నట్లుగా తమను కొనుగోలు చేసేందుకు స్వామీజీలు రంగంలోకి దిగిన మాట వాస్తవమే అయితే... వారు తమ ఫోన్ సంభాషణల్లో చెప్పినట్లుగా ఢిల్లీలో ఉన్న నెంబర్ వన్, నెంబర్ టూ, ఆ తర్వాత బీఎల్ సంతోష్ లను నిందితులుగా చేర్చాలని, వారి తర్వాతే స్వామీజీలను నిందితులుగా చేర్చాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక వేళ ఈ వ్యవహారాన్ని టీఆర్ఎస్ రూపకల్పన చేసి ఉంటే... తొలి నిందితుడిగా సీఎం కేసీఆర్, రెండో నిందితుడిగా మంత్రి కేటీఆర్, ఆతర్వాత నలుగురు ఎమ్మెల్యేలు నిందితులుగా ఉండాల్సి ఉందన్నారు. అయినా ఈ కేసులో స్వామీజీ మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు... ఈ వ్యవహారంలో కీలకంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ఎందుకు సీజ్ చేయలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం బీజేపీ, టీఆర్ఎస్ రెండూ కలిసి ఆడిన నాటకంగా రేవంత్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు ఆ రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నాయని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే రఘునందన్ రావు ఇంటిలో దొరికిన దబ్బు ఏమైందో ఇప్పటికీ తేలలేదన్నారు. అదే సమయంలో హుజూరాబాద్ ఎన్నికలో ఈటల రాజేందర్ పై కారాలు మిరియాలు నూరిన కేసీఆర్ ఆ తర్వాత చప్పుడు చేయకుండా మౌనంగా ఉండిపోయారన్నారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను బలహీనం చేసేందుకే ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు.