Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ లో ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా భవిష్యత్తు నేడు జరుగుతున్న శ్రీలంక, ఇంగ్లాండ్ మ్యాచ్ పైనే ఆధారపడి ఉంది. గ్రూప్-1లో ఇప్పటికే న్యూజిల్యాండ్ సెమీస్ చేరుకోగా మరో జట్టుకు మాత్రమే సెమీస్ అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు కలిగిన జట్లలో ఒకటి ఆస్ట్రేలియా కాగా నేడుశ్రీలంకతో తలపడుతున్న ఇంగ్లాండ్ జట్టు రెండోది. నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే ఆ జట్టు నేరుగా సెమీస్ చేరుతుంది. అలా కాకుండా ఇంగ్లాండ్ పై శ్రీలంక నెగ్గితే ఆస్ట్రేలియా సెమీస్ చేరుతుంది. ఈ లెక్కల ఆధారంగానే ఆసీస్ జట్టుతో పాటు ఆస్ట్రేలియా సగటు క్రికెట్ అభిమాని నేటి మ్యాచ్ లో ఎలాగైనా శ్రీలంక గెలవాలని కాంక్షిస్తున్నాడు.
అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు పెద్దగా రాణించలేకపోయింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక (67) అర్థ సెంచరీతో శుభారంభాన్ని ఇచ్చినా... మిడిలార్డర్ మాత్రం జట్టు స్కోరును పరుగులు పెట్టించలేకపోయింది. వరుసగా వికెట్లను చేజార్చుకున్న లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేసి... చావోరేవో అన్నట్లుగా సాగుతున్న ఇంగ్లాండ్ జట్టుకు అలవోక లక్ష్యాన్ని నిర్దేశించారు. కుశాల్ మెండిస్ (18), భానుకా రాజపక్స (22)లు ఫరవా లేదనిపించినా... మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ ను ఇంగ్లాండ్ బౌలర్లు చీల్చి చెండాడరనే చెప్పాలి. ఓపెనర్ పథుమ్ నిస్సంక మినహా ఏ ఒక్క బ్యాటర్ ను కూడా ఇంగ్లిష్ బౌలర్లు క్రీజులో కుదురుకోనీయ లేదు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ కు ఏకంగా 3 వికెట్లు దక్కగా... బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, శామ్ కర్రన్, ఆదిల్ రషీద్ లకు తలో వికెట్ దక్కింది. ఓ వికెట్ తో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంలో ఆదిల్ రషీద్ సత్తా చాటాడు. ఇక కాసేపటి క్రితమే 142 పరుగుల విజయలక్ష్యంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ప్రారంభించారు. తొలి ఓవర్ ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు కేవలం 3 పరుగులు చేసింది.