Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బిడ్డ చనిపోయిన బాధను గుండెల్లో దిగమింగి, బైక్ పై మృతదేహంతో ఇంటికి బయల్దేరాడా తండ్రి.. ఉచిత అంబులెన్స్ సౌకర్యం లేదని ఆసుపత్రి సిబ్బంది తేల్చిచెప్పడంతో గత్యంతరంలేక 65 కిలోమీటర్ల దూరం బైక్ పై మృతదేహాన్ని తన తరలించాడు. ఖమ్మం జిల్లాలో జరిగిందీ అమానవీయ సంఘటన.. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామానికి చెందిన గిరిజన బాలిక వెట్టి సుక్కి ఇటీవల అనారోగ్యానికి గురైంది. సుక్కిని ఆమె తండ్రి ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ ఆదివారం సుక్కి చనిపోయింది. దీంతో మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఉచిత అంబులెన్స్ కోసం అడగగా.. ఆస్పత్రి సిబ్బంది లేరని చెప్పారు. ఆసుపత్రి బయట ఉన్న ప్రైవేటు వాహనదారుల దగ్గర విచారిస్తే.. పెద్ద మొత్తంలో డబ్బులు అడిగారు. దీంతో ఆ తండ్రికి ఏంచేయాలో పాలుపోలేదు. బిడ్డ మృతదేహం, భార్య, తండ్రిలను బైక్ పై కూర్చోబెట్టుకుని ఇంటికి బయల్దేరాడా పాప తండ్రి. ఖమ్మం నుంచి కొత్తమేడేపల్లి దాదాపు 65 కిలోమటర్ల దూరంలో ఉంటుంది. ఇంతదూరం కూడా పాప మృతదేహంతో పాటు పాప తల్లిదండ్రులు, తాత కలిపి నలుగురు ప్రయాణించారు. దీనిని కొంతమంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.