Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నిర్మించతలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మంత్రి హోదాలో నారాయణ ఉద్దేశపూర్వకంగా మార్చారని, తన వారికి మేలు చేసేందుకే ఆయన ఈ పని చేశారంటూ ఏపీ సీఐడీ ఓ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఐడీ అధికారులు చర్యలు మొదలుపెట్టకముందే నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్సల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి ఉందని, ఈ క్రమంలో అమరావతి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరగా కోర్టు అందుకు సానుకూలంగా స్పందించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అయితే నారాయణకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ప్రతి చిన్న విషయానికి సుప్రీంకోర్టు తలుపు తడితే ఎలా? అంటూ ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములను చేయొద్దని ఏపీ సర్కారుపై కోర్టు కీలక వ్యాఖ్యులు చేసింది.