Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నాగోలు ఫ్లై ఓవర్పై ఓ లారీ హల్ చల్ చేసింది. ఈ ఘటనలో రెండు కార్లు, రెండు బైకులు ధ్వంసం కాగా, ఆరుగురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం మల్లాపూర్ సాయినగర్కు చెందిన శ్రీను (25) లారీ డ్రైవర్. నాచారంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఆయన ట్యాంకర్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆయిల్ తరలిస్తుంటాడు. రోజువారీలానే సోమవారం ఉదయం కూడా ఎయిర్పోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా నాగోలు ఫ్లైఓవర్ వద్ద బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అదుపు తప్పిన లారీ ముందు వెళ్తున్న రెండు కార్లు, రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లు ధ్వంసం కాగా, అందులో ఉన్న జాలా వెంకమ్మ (65), ఆమె కోడలు విజయ (35) గాయపడ్డారు. వెంకమ్మ ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం కిమ్స్ ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ఘటన జరగడం దారుణం. అలాగే, బైకర్లు మర్రికంటి రమేశ్, చెన్నకేశవులు గాయపడ్డారు. మరో బైక్పై వెళ్తున్న కొత్తపేట గ్రీన్హిల్స్ కాలనీ జనప్రియ క్వార్టర్స్కు చెందిన కె.రాజశేఖర్, రమాదేవి దంపతులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.