Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్ సహా.. తెలంగాణలోని పలు గ్రానైట్ పరిశ్రమల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ , ఆదాయపన్ను శాఖ ముప్పేట దాడులు చేశాయి. బుధవారం ఉదయం నుంచి ఈ రెండు శాఖలు సంయుక్తంగా మంత్రి నివాసం సహా.. హైదరాబాద్, కరీంనగర్లలో సోదాలు నిర్వహించాయి. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ప్రగతిభవన్కు కేసీఆర్ పిలిపించారు. కేంద్రం ఇదే తంతు కొనసాగిస్తే చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు చేశారు. కరీంనగర్లోని మంత్రి గంగుల నివాసంతోపాటు అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. మంత్రి గంగులకు సంబంధించిన శ్వేతా గ్రైనేట్స్లో డైరెక్టర్లుగా ఉన్న మంత్రి సోదరులు గంగుల సుధాకర్, వెంకన్నతోపాటు బోనాల శ్రీనివాస్, రాజేశం, పొన్నమనేని గంగాధర్ రావు, మహిపాల్ రెడ్డితోపాటు మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. మంత్రి గంగుల ఇంటికి తాళం ఉండడంతో.. ఆయన పీఏను పిలిపించిన ఈడీ, ఐటీ అధికారులు.. తాళాన్ని పగులగొట్టి.. లోనికి వెళ్లారు. తనిఖీలు నిర్వహించారు. అలాగే హైదరాబాద్ సోమాజిగూడ గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసం, పంజగుట్టలోని పీఎస్ఆర్ గ్రానైట్ సంస్థ కార్యాలయం, హైదర్గూడ అత్తాపూర్లోని జనప్రియా హితోపియా అపార్ట్మెంట్లోని అరవిందో గ్రానైట్స్ వ్యాపారి వెంకటేశ్వరరావుకు చెందిన కార్యాలయం, హిమాయత్నగర్లోని పలు గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో ఈడీ, ఐటీ బృందాలు సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి.