Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా సీనియర్ రాజకీయ వేత్త కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలంగాణ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. టీ టీడీపీ అధ్యక్షుడిగా ఈ నెల 4న కాసానిని నియమిస్తూ చంద్రబాబు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని చంద్రబాబు నివాసం నుంచి పార్టీ కార్యాలయం వరకు కాసాని తన అనుచరులతో కలిసి బారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన... తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కృషి చేస్తానని ప్రతినబూనారు. హైదరాబాద్ నడిబోడ్డుననే టీడీపీ ఆవిర్భవించిన విషయాన్ని ఈ సందర్భంగా కాసాని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే క్రమశిక్షణ అని... క్రమశిక్షణ అంటే చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధే పార్టీ శ్రేణులకు ఎజెండా అన్న కాసాని... చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని ప్రకటించారు.