Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం 14 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చెన్నైతో పాటు తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణీపేట్, వెల్లూరు, సాలెం నాగపట్నం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇంతటి వర్షపాతం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పొన్నేరి, అవడి ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో.. తమిళనాడు, పుదుచ్ఛేరి వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సముద్రంలో అలల ఉధృతి నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.