Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్: అమరావతి మాస్టర్ ప్లాన్ లో సవరణలపై రైతుల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. గ్రామ సభలు నిర్వహించకుండా తమకు నోటీసులు ఇవ్వడం పట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారన్న వాదనలు విన్న న్యాయస్థానం మాస్టర్ ప్లాన్ సవరణలపై అమరావతి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిలోని 17 గ్రామాల్లో రెండ్రోజుల వ్యవధిలో గ్రామసభలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు మందడం, లింగాయపాలెం గ్రామాల్లో ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించగా, మిగతా గ్రామాల్లోనూ గ్రామసభలు జరపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులకు ఏపీ సర్కారు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధానిలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా ఆర్-5 అనే జోన్ ను ఏర్పాటు చేస్తూ ఈ నోటిఫికేషన్ ను తీసుకువచ్చింది. ఈ జోన్ ఏర్పాటు కోసం సీఆర్డీయే చట్ట సవరణ చేస్తున్నట్టు పేర్కొంది.
ఐదు గ్రామాల పరిధిలోని 900 వందల ఎకరాలను ఈ ఆర్-5 జోన్ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలను 15 రోజుల్లో సీఆర్డీయేకి తెలియజేయాలని పేర్కొంది. అయితే, రైతులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామసభలు జరపకుండానే తమకు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చారంటూ హైకోర్టును ఆశ్రయించగా ఆ తరుణంలో రైతుల అభ్యంతరాలపై విచారణ జరిపిన న్యాయస్థానం పై విధంగా ఆదేశాలు తీసుకోచ్చింది.