Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరిస్తున్న దానిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఆధునీకరిస్తోంది. ప్రస్తుతం స్టేషన్ లో అభివృద్ధి పనులు కొనసాగుతుండగా ఈ పనులను సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ తరుణంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుతో పాటు ఆధునీకరణ పూర్తి అయిన తర్వాత రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందన్న చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కిషన్ రెడ్డి తెలిపిన ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు రానున్న మూడేళ్లలో పూర్తి కానున్నాయి. రూ.719 కోట్లతో జరుగుతున్న ఈ పనులు పూర్తి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అన్నీ ఆధునిక సదుపాయాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 4 అంతస్తుల్లో కారు పార్కింగ్, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ఏర్పాట్లతో రానున్న 30 ఏళ్లకు సరిపడ వసతులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి వచ్చినట్లేనని కిషన్ రెడ్డి అన్నారు.