Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వారంతా స్నేహితులు. ఒకే మెకానిక్ షెడ్డులో పనిచేస్తున్నారు. కార్తిక మాసం కావడంతో సరదాగా విహారయాత్రకు వచ్చారు. అంతా కలిసి జలపాతంలో స్నానం చేస్తుండగా... కళ్లెదుటే ఒక స్నేహితుడు కొట్టుకుపోయి ప్రాణాలొదిలాడు. ఈ విషాదరకర సంఘటన చింతూరు మండలం పొల్లూరు జలపాతం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మోతుగూడెం ఎస్సై వాసంశెట్టి సత్తిబాబు, మృతుడి స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం...పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఓ మెకానిక్ షెడ్డులో పనిచేస్తున్న ఏడుగురు స్నేహితులు విహార యాత్రలో భాగంగా మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పొల్లూరు జలపాతానికి వచ్చారు. స్నానాలు చేసేందుకు జలపాతంలోకి దిగి ప్రమాదవశాత్తు శివాసి పవన్ కుమార్(19) జారిపడ్డాడు. అప్రమత్తమైన స్నేహితులు హుటాహుటిన అతడిని బయటకు తీసి మోతుగూడెం జెన్కో ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కళ్ల ముందే స్నేహితుడు జలపాతంలో పడి మృతిచెందడంతో మిగిలిన వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పవన్ తణుకులోని తన మామయ్య అయిన మెకానిక్ నాగరాజు దగ్గర పని చేస్తున్నాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.