Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ట్రైయల్ రన్ ప్రారంభం కానుంది. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సాగర తీరాన ట్రాక్ పనులు, గ్యాలరీ ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఫార్ములా ఈ రేస్ నిర్వహణ నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 21వ తేదీ నుంచి యథావిధిగా పార్కులు తెరుచుకోనున్నాయి. కాగా రేసింగ్ పోటీల కోసం బుధవారం (నవంబర్16) నుంచే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్ల వద్ద ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కంపౌండ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ ఆలయం రూట్, ట్యాంక్బండ్ పరిసరాలలో వెళ్లవద్దని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు. ఆ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని, అనసవసరంగా ఆ రూట్లలో వెళ్లి ట్రాఫిక్లో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు.
కాగా ఈ రేసింగ్ పోటీల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 2.3 కిలోమీటర్ల పాటు ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ పార్క్, సంజీవయ్య పార్క్ మీదుగా ఈ ట్రాక్ ఉంటుంది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ హుస్సేన్ సాగర్ చుట్టూ జరుగనుంది. రేస్ నడుస్తోన్న సమయంలో అవసరమైన పిట్స్టాప్స్, ప్రేక్షకులు తిలకించడానికి వీలుగా సీటింగ్, ఫెన్సింగ్ నిర్మాణం వంటి పనులను చేపట్టింది. ఫిబ్రవరి 11, 2023న హైదరాబాద్ లో జరగనున్న రేసుతో ఫార్ములా ఈ మొదటిసారిగా భారతదేశానికి చేరుకుంటుంది. ఫార్ములా 1 ఇండియన్ తర్వాత దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి.