Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.
ట్రాఫిక్ జాయింట్ సీపీ మాట్లాడుతూ.. ''ఏ వాహనం వల్ల ఎక్కువ విధ్వంసం జరిగేందుకు అవకాశం ఉంటుందో.. అలాంటి వాహనాలు నిబంధనలు అతిక్రమిస్తే ఎక్కువ మొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించాం. రాంగ్ రూట్లో రావడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఇలాంటి సందర్భాల్లో నిబంధనలు పాటించని వాహనాలకు పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తున్నాం. రాంగ్ రూట్లో వచ్చే వాహనాలకి రూ.1,700 వరకు, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 వరకు జరిమానా విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ నేపథ్యంలోనే ఈనెల 28 నుంచి ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నాం. జీవో ప్రకారమే కొత్త రవాణా నిబంధనలు అమలు చేస్తాం. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైనా పట్టుబడితే ఆ వాహనదారుడిపై గతంలోనూ ఏమైనా చలాన్లు ఉన్నాయా? లేవా? అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. వాహనదారులు చేసిన తప్పే మళ్లీ చేయకుండా.. వారిలో క్రమశిక్షణ తీసుకువచ్చేందుకే నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నాం.
పోలీసులు, ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వం పోలీసు శాఖకు రూ.వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తోంది. ట్రాఫిక్ చలాన్లను ఆదాయ వనరుగా ఎప్పుడూ మేం పరిగణించలేదు. రోడ్డు ప్రమాదాలు నివారించడమే మా ప్రధాన లక్ష్యం. కేవలం చలాన్ల మీదనే పోలీసులు దృష్టి పెడుతున్నారని చాలా మంది భావిస్తున్నారు. అది సరైంది కాదు. నగరంలో చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు చలాన్ వేస్తాం. అందులో అడిగేందుకు ఏమీ ఉండదు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరణలో భాగంగానే ఇదంతా చేస్తున్నాం. ఇందులో భాగంగానే 'ఆపరేషన్ రోప్'ను ప్రారంభించాం. వాహనదారుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలో కావాల్సిన చోట్ల యూ టర్న్లు ఏర్పాటు చేసే విషయంలో సమీక్ష చేస్తున్నాం'' అని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.