Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలు ఉన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోగుండా పట్టణానికి చెందిన ప్రకాష్ గామేటి, 27 ఏళ్ల భార్య దుర్గా, వారి నలుగురు పిల్లలతో కలిసి తన సోదరుల ఇళ్లకు సమీపంలోని ఇంటిలో నివసిస్తున్నాడు. సోమవారం ఎంతసేపటికీ వారి ఇంటి తలుపు తెరుచుకోలేదు. దీంతో ప్రకాష్ సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. ప్రకాష్, ముగ్గురు పిల్లలు సీలింగ్కు వేలాడుతూ చనిపోగా, భార్య దుర్గా, మరో చిన్నారి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు. భార్య శరీరంపై గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆ కుటుంబం ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉంటుందని అనుమానించారు.
కాగా, ప్రకాష్ తొలుత తన భార్య, చిన్నారిని గొంతునులిమి హత్య చేసిన తర్వాత ముగ్గురు పిల్లలను సీలింగ్కు వేలాడదీసి చంపి చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడు ప్రకాష్ గుజరాత్లో పని చేసేవాడని, బస్సుల్లో పళ్లు అమ్మేవాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.