Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జకర్తా: ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో నమోదైన ప్రకంపనల ధాటికి దేశ ప్రధాన భూభాగమైన జావా ద్వీపం వణికిపోయింది. భయంతో ప్రజలు ఇళ్లు, అపార్ట్మెంట్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తు కారణంగా పశ్చిమ జావాలోని సియాంజుర్లో ఇప్పటివరకు దాదాపు 56 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మరో 700కు పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. వందలాది ఇళ్లు, ఇతర నిర్మాణాలు ధ్వంసం కావడంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నట్లు సియాంజుర్ పాలనాధికారి హెర్మన్ సుహెర్మాన్ ఓ వార్తాసంస్థతో తెలిపారు.
సియాంజుర్ పట్టణం.. దేశ రాజధాని జకర్తాకు ఆగ్నేయ దిశలో 75 కి.మీల దూరంలో ఉంది. ఇక్కడే 10 కి.మీల లోతులో భూకంప కేంద్రం నమోదైందని, అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ప్రభుత్వ వాతావరణ, జియోఫిజిక్స్ సంస్థ 'బీఎంకేజీ' వెల్లడించింది. భూకంపం అనంతరం కూడా ఇక్కడ 25 వరకు ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో.. ప్రకంపనల సమయంలో ప్రజలు ఆరుబయటే ఉండాలని బీఎంకేజీ చీఫ్ ద్వికోరిటా కర్ణావతి సూచనలు చేశారు. మరోవైపు.. జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు ఇప్పటికే రంగంలోకి, సహాయక చర్యలు ప్రారంభించాయి. అనేక ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని.. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.