Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢీల్లి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు రూ.573.13 కోట్లు విడుదల చేశామని కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్-భూపాలపట్నం సెక్షన్లో 163వ జాతీయ రహదారి విస్తరణ, నాగర్కర్నూల్ జిల్లాలో కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, ఎన్హెచ్-167కేలో 2-4 లేన్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. వీటిలో నాగర్కర్నూల్ జిల్లాలో కృష్ణా నదిపై రూ.436.91 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ రహదారి వల్ల హైదరాబాద్ నుంచి తిరుపతి, నంద్యాల, చెన్నైల మధ్య దాదాపు 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ ఐకానిక్ బ్రిడ్జి ఇరు రాష్ట్రాలకు గేట్ వేగా నిలుస్తుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇక, రూ.136.22 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి 163 (హైదరాబాద్-భూపాలపట్నం)పై ములుగులో ప్రస్తుతమున్న రెండు లైన్ల రోడ్డు విస్తరణకు కూడా ఆమోదం తెలిపారు. లక్నవరం సరస్సు, బొగత జలపాతం వంటి ప్రముఖ పర్యాటక స్థలాలకు మరింత ప్రాచుర్యం లభించనుంది. అలాగే, ఈ రోడ్డు విస్తరణవల్ల తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయని మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.