Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామారెడ్డి: సర్పంచ్ వేధింపులు తాళలేక దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. గాంధారి మండలం సోమారం తాండా సర్పంచ్ కిషన్ నాయక్ వేధింపులు భరించలేక బానోత్ శంకర్, సునీత్ అనే భార్యాభర్తలిద్దరూ గడ్డి మందు సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాంధారి మండల కేంద్రంలో సర్పంచ్ కిషన్ నాయక్కు చెందిన 240 గజాల స్థలాన్ని శంకర్కు విక్రయించారు. కానీ... కొనుగోలు చేసిన డబ్బు మొత్తం ముట్టినప్పటికీ కిషన్ నాయక్.. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయకపోగా... డబ్బు కూడా తిరిగివ్వలేదు. బాధితులకు రూ.35 లక్షలివ్వాలని పెద్దమనుషుల సమక్షంలో తీర్మానం జరిగింది. అయినప్పటికీ సర్పంచ్ ఇవ్వనని భీష్మించడంతో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సర్పంచ్ తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.