Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢీల్లి: ఈ నెల 19 వరకు దేశంలో 219.86కోట్ల డోసులు ఇవ్వగా వీటిలో 92,114 ప్రతికూల ప్రభావాల కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా ఓ బాలిక గతేడాది 29న కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న తర్వాత జూన్ 19న మరణించింది. మరో ఎంఎస్సీ విద్యార్థిని గత ఏడాది జూన్ 18న కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకోగాజూలై 10న కన్నుమూసింది. ఈ తరుణంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ను ప్రజాప్రయోజనాల దృష్టా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల కారణంగా గతేడాది ఇద్దరు బాలికలు మరణించగా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ఇది విషాదకరమైనా ప్రభుత్వం మరణాలకు బాధ్యత వహించదని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అర్హులైన వ్యక్తులు టీకా వేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించిందని, అయితే దానికి ఎలాంటి చట్టపరమైన బలవంతం లేదని అఫిడవిట్లో పేర్కొంది. అయితే, ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగస్టు 29న కేంద్రానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వాక్సిన్ దుష్ప్రభావాలతో బాధపడుతున్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి చికిత్స అందించేందుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వానికి ఆదేశాలను ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ప్రతి వ్యాక్సిన్కు ఇమ్యునైజేషన్ అనుసరించే ప్రతికూల సంఘటనలు నివేదించబడుతున్నాయని, వ్యాక్సిన్లు థర్డ్ పార్టీలతో తయారవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించిన సమాచారం పబ్లిక్ డొమైన్లో ఉచితంగా అందుబాటులో ఉందని కోర్టుకు తెలిపింది.
ఈ క్రమంలో పిటిషనర్ల నష్ట పరిహారం డిమాండ్ను ఆరోగ్యమంత్రిత్వ శాఖ తోసి పుచ్చింది. వ్యాక్సినేషన్ ప్రతికూల ప్రభావాలతో వ్యక్తి శారీరకంగా గాయమైనా, మరణించినా చట్టప్రకారం అతని కుటుంబం పరిహారం కోరుతూ సివిల్ కోర్టులో దావా వేయొచ్చని. నిర్లక్ష్యానికి సంబంధించిన కేసుల వారీగా కేసు నమోదు చేయవచ్చని అఫిడవిట్ పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వేస్ వాదనలు వినిపిస్తూ వ్యాక్సిన్తో కలిగే నష్టాలను ముందుగానే తెలియజేసి సమ్మతి తీసుకుని ఉంటే ఈ మరణాలు సంభవించి ఉండేవి కావన్నారు.