Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత వృద్ధి చేసే కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం డిసెంబర్ 29 నుంచి అమల్లోకి రానుంది. ఇందు కోసం రెండు దేశాలు తమ వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలను పూర్తి చేశాయి. స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఇరు దేశాల మధ్య ఎటువంటి సుంకాల్లేకుండా, కొన్నింటిపై నామమాత్రపు టారిఫ్ లతో చేసుకునే వస్తు, సేవల ఎగుమతులు, దిగుమతులు. దీనివల్ల పలు రంగాల కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. తద్వారా ఆయా రంగాల్లో మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఎకనమిక్ కోపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈసీటీఏ)ను అమలు చేయడానికి వీలుగా అన్ని చర్యలను అమల్లో పెట్టినట్టు ఆస్ట్రేలియాకు భారత్ తెలియజేసింది. దీన్ని ఆస్ట్రేలియా స్వాగతించింది. ఈ ఒప్పందంపై రెండు దేశాలు ఏప్రిల్ 2న సంతకం చేయగా.. చట్టపరమైన ఆమోదాలకు ఇంత సమయం తీసుకుంది. ఆస్ట్రేలియా గత వారమే పార్లమెంటు ఉభయసభల్లో దీనికి ఆమోదం తెలిపింది. డిసెంబర్ 29 నుంచి భారత్ కు దిగుమతి అయ్యే 85 శాతం ఆస్ట్రేలియా ఉత్పత్తులపై టారిఫ్ లు తొలగిపోతాయి. మరో 5 శాతం ఉత్పత్తులపై అధిక టారిఫ్ లను క్రమంగా ఎత్తేస్తారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 31 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య నడుస్తోంది. ఐదేళ్లలో ఇది 50 బిలియన్ డాలర్లకు వెళుతుందని భారత్ అంచనా వేస్తోంది. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతులు 7 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2026-27 నాటికి 10 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్నది అంచనా. 10 లక్షలకు పైగా అదనపు ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.