Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మాండౌస్ తుపాను కారణంగా రాష్ట్రంలోని వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా తో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. వర్షాలకు పంటలు నీట మునగడంతో కన్నీరుమున్నీరు అవుతున్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా శాపంగా మారిందన్నారు. కళ్లాల్లోకి చేరిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో అది కూడా తడిసి పాడైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అధికారులను వెంటనే క్షేత్ర స్థాయికి పంపించి పంట నష్టాన్ని అంచనా వేయాలని అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమాన్నికేవలం పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేశారని ముఖ్యమంత్రిని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పారు. వర్షానికి తడిసిన పంటలను కూడా మద్ధతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. వరదలకు పంట కొట్టుకుపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని అచ్చెన్నాయుడు కోరారు.