Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ పీసీసీకి సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం నిన్న పలు కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో మాజీ మంత్రి కొండా సురేఖకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కల్పించారు. అయితే, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి తనను ఎంపిక చేయకపోవడం పట్ల కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ క్రమంలో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ క్రమంలో ఆమె టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్ కమిటీలు తనకు అసంతృప్తిని కలిగించాయని ఆమె రాసుకొచ్చారు. తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్లో తన పేరు లేదని, వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ లీడర్ పేరు లేకపోవడం మనస్తాపం కలిగించిందన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేశానని, తన భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా చేశారని, తమ కుటుంబానికి రాష్ట్రంలో ఎంతో పేరుందని అన్నారు. కానీ, తనను ఎగ్జిక్యూటివ్ కమిటీలో వేయడం బాధించిందని కొండా సురేఖ వాపోయారు. ఎమ్మెల్యేలుగా కూడా గెలవని వారు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారని, తనను కూడా వారితో పాటే పరిగణించడం అసంతృప్తి కలిగించిందని తన సీనియారిటీని తగ్గించి ఆ కమిటీలో వేశారని, అందుకే పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.