Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పాఠశాల బస్సు బోల్తాపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన రాయ్ఘడ్ జిల్లాలోని కోపోలి సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని చెంబూర్లో గల ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 10వ తరగతి చదువుతున్న 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు విహార యాత్ర కోసం లోనావాలా ప్రాంతానికి (కొండ ప్రాంతం) వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో ముంబై-పుణె హైవేపై రాత్రి 8 గంటల ప్రాంతంలో కొండలు దిగుతుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే లోనావాలా, కోపోలి తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.