Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న తెలంగాణకు రానున్నారు. ఐదురోజులపాటు సాగే పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెల 28న భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంతోపాటు ములుగు జిల్లా రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించి, ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన తరుణంలో రాష్ట్రపతి రామప్పను సందర్శించడం ఇదే ప్రథమం. రామప్ప ఆలయ ప్రాంగణంలో ఆమె ప్రసాద్ పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ వెంటనే బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి, వీరనారీమణులను సత్కరిస్తారు. రాత్రి 7.45కి రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు. 27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో రాష్ట్రపతి సమావేశమవుతారు. మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మాల్దీవులు తదితర దేశాల అధికారులతోనూ సమావేశమవుతారు.
28న తొలుత భద్రాచలం, ఆ తరువాత రామప్ప ఆలయాలను సందర్శించి ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. అదేరోజు మిశ్ర ధాతు నిగం లిమిటెడ్(మిథాని)కి సంబంధించిన వైడ్ప్లేట్ మిల్ ప్లాంట్ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. 29న ఉదయం షేక్పేటలోని జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాలను సందర్శించి, విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమవుతారు. సాయంత్రం శంషాబాద్లోని శ్రీరామ్నగర్లో శ్రీరామానుజాచార్య (సమతామూర్తి) విగ్రహాన్ని సందర్శిస్తారు.
30న రంగారెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనంలో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతికశాఖ, శ్రీరామచంద్రమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టనున్న హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.