Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడులో జరిగిన టీడీపీ నేత షేక్ ఇబ్రహీం హత్యపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇబ్రహీం హత్య అత్యంత కిరాతకమని చంద్రబాబు ట్వీట్ చేశారు. పల్నాడులో శాంతి భద్రతల దుస్థితికి ఈ హత్య నిదర్శనమని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి పల్నాడును ఏంచేయాలనుకుంటున్నారోనని అన్నారు. ఇబ్రహీం హత్యపై జవాబు చెప్పాలని సీఎం జగన్ ను నిలదీశారు. పల్నాడు జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం చంద్రబాబు ట్వీట్ చేశారు.
ముస్లిం మైనారిటీలను అంతమొందించేందుకే జగన్ ముఖ్యమంత్రి అయినట్టుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న షేక్ ఇబ్రహీంను పట్టపగలు, అందరూ చూస్తుండగానే హత్య చేయడం జగన్ సైతాన్ పాలనకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన మరో కార్యకర్త అలీ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని లోకేశ్ చెప్పారు. అలీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.