Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దును సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్ల గురించి తెలిసిందే. ఆ క్రమంలో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రిజర్వ్ చేసిన తీర్పును కొత్త ఏడాదిలో జనవరి 2న తెలుపనున్నది. 2016 నవంబర్లో పాత రూ.500, రూ.1,000 నోట్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 50కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది పీ చిదంబరం పిటిషనర్ల తరుఫున వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అబ్దుల్ నజీర్, బీఆర్ గవాయ్, ఏఎస్ బొపన్న, వీ రామసుబ్రమణియన్, బీవీ నాగరత్నలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అన్ని వర్గాల వాదనలు విన్నది. 2016లో తీసుకున్న నోట్ల రద్దు విధానానికి సంబంధించిన అన్ని పత్రాలు, రికార్డులను సమర్పించాలని కేంద్రాన్ని, ఆర్బీఐని ఆదేశించింది. ఈ నెల 7న రిజర్వ్ చేసిన తీర్పును జస్టిస్ నజీర్ పదవీ విరమణకు ఒక రోజు ముందైన జనవరి 2న తెలుపనున్నది.