Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్రలో ఎక్కడా కూడా డబ్బు అనే మాట లేదు, మనీలాండరింగ్ జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీ బండారం బయటపెట్టినందుకే ఈడీని ప్రయోగించారని రోహిత్రెడ్డి ఆరోపించారు. ‘‘ఏదో విధంగా ఈడీని పంపించి నన్ను ఇబ్బంది పెట్టి, భయబ్రాంతులకు గురి చేసి.. లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో వారు వ్యవహరిస్తున్నారు. నన్ను, నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న నన్ను పిలిచి విచారించారు. ఏ కేసులోనైనా నిందితులను ముందుగా పిలిచి విచారణ జరపడం మనందరికీ తెలిసిన విషయం. కానీ ఈ కేసులో మాత్రం అందుకు విరుద్ధంగా ఫిర్యాదుదారుడిని పిలిచి విచారించడం విడ్డూరంగా ఉంది. రెండు రోజులు నన్ను, అభిషేక్ను పిలిచి విచారించినా.. వాళ్లు అనుకున్నది అనుకున్నట్టు ఏదీ జరగలేదు.
దీంతో రూటు మర్చి.. ముఖ్య సూత్రధారి అయిన నందకుమార్ని విచారిస్తామని కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. రోహిత్రెడ్డిని అతని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంగా.. నందకుమార్తో వారికి అనుకూలంగా స్టేట్ మెంట్ తీసుకోవాలని చూస్తున్నారు. ఆ వాంగ్మూలంతో నన్ను ఈ కేసులో ఇరికించడమే వారి వ్యూహం అని మాకు అందిన సమాచారం. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుగా బీజేపీ వ్యవహారం ఉందని ఆయన తెలిపారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నా కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసినా.. వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతియాలని చూసినా.. నేను మాత్రం తగ్గేదే లే. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టినా ఎక్కడా వారికి ఎదురు దెబ్బ తగల్లేదు. కేవలం తెలంగాణలో మాత్రమే వారు అనుకున్నది ఒకటి.. అయిందొకటి. దీన్ని ఓర్వలేక అనేక కుట్రలు పన్నుతున్నారు. బీజేపీ నాయకులకు ఒకటే చెబుతున్నా.. మీరు ఎన్ని నోటీసులిచ్చినా, ఎన్ని విచారణలు జరిపినా, ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టు చేసినా నేను మాత్రం మీకు లొంగేదే లేదు. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు పన్నిన కుట్రలన్నింటిని భగ్నం చేస్తాం.. తిప్పి కొడతాం. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నాం’’ అని రోహిత్రెడ్డి వెల్లడించారు.