Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమవుతున్నది. ఈ తరుణంలో జోరు వానకు వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 మంది మరణించగా, 23 మంది గల్లంతయ్యారు. వర్షాల వల్ల 45 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో అధికారులు వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోయాయి.
దీంతో రవాణాకు అంతరాయం ఏర్పడి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.