Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో తాజాగా రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటిలో ఒకటి విశాఖపట్టణంలో నమోదు కాగా, మరోటి చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తికి మొన్న కుప్పం పీహెచ్సీలో ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అదే రోజు రాత్రి ఆ వ్యక్తిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడి ఐడీహెచ్ వార్డులోని కొవిడ్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. నిన్న ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించి నమూనాలు సేకరించారు. అయితే, బాధితుడు నిన్న మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రి నుంచి మాయమయ్యాడు.
దీనిపై ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ సురేశ్వర్ రెడ్డి స్పందిస్తూ బాధితుడికి ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ అతడిలో ఎలాంటి లక్షణాలు లేవని (అసింప్టమాటిక్) తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, తనకు ఎలాంటి సమస్యలు లేవని, తనను పంపేయాలంటూ బాధితుడు సిబ్బందితో ఉదయం నుంచి వాదనకు దిగుతున్నాడని, మధ్యాహ్న భోజన సమయంలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని అన్నారు. మరోకరు విశాఖపట్టణంలోని రైల్వే న్యూ కాలనీకి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి కూడా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆయనలో లక్షణాలు కూడా ఉన్నాయి. జ్వరం, ఇతర లక్షణాలు కనిపించడంతో వైద్యుల సూచన మేరకు ఆయన కరోనా టెస్టు చేయించుకున్నాడు. అందులో అతడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ఆరిలోవ హెల్త్ సిటీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు.