Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
భారత్, పాకిస్థాన్లు తమ దేశాల్లోని జైళ్లలో ఉన్న పౌరులు, మత్స్యకారుల జాబితాను ఆదివారంనాడు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. కాన్సులర్ యాక్సిస్పై 2008లో కుదిరిన ఒప్పందం నిబంధనల ప్రకారం న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లలోని దౌత్య కార్యాలయాల్లో అధికారులు ఈ జాజితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏటా జనవరి 1, జూలై 1 తేదీల్లో ఈ జాబితాను మార్చుకుంటారు. జాబితాలోని వివరాల ప్రకారం, 339 సాధారణ పౌరులు, 95 మంది పాకిస్థానీ మత్స్యకారులు ప్రస్తుతం భారతదేశ కస్టడీలో ఉన్నారు. పాకిస్తాన్ జాబితాలో 51 మంది భారత పౌరులు, 654 మంది మత్స్యకారులు వారి కస్టడీలో ఉన్నారు. సివిలియన్ ఖైదీలు, జాడతెలియకుండా పోయిన భారత రక్షణ శాఖ సిబ్బంది, మత్సకారులను వారి పడవలతో సహా సాధ్యమైనంత త్వరగా పాకిస్థాన్ కస్టడీ నుంచి తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం ఆ ప్రకటనలో కోరింది. జైలుశిక్ష పూర్తి చేసుకుని, జాతీయత గుర్తించిన 631 మంది మత్స్యకారులు, ఇద్దరు సివిలియన్ ఖైదీలను త్వరితగతిన విడిచి వెట్టాలని పాకిస్థాన్ను కోరినట్టు ఎంఈఏ తెలిపింది. భారతీయులుగా అనుమానిస్తున్న పాక్ కస్టడీలోని తక్కిన 32 మంది మత్స్యకారులు 22 సివిలియన్ ఖైదీలను కూడా విడిచిపెట్టాలని ఎంఈఏ కోరింది. భారత సివిలియన్ ఖైదీలు, మత్స్యకారులుగా భావిస్తున్న వారందరికి తగిన భద్రత కల్పించి భారత్కు తిరిగి పంపించాలని విజ్ఞప్తి చేసింది.