Authorization
Mon Jan 19, 2015 06:51 pm
lవతెలంగాణ న్యూఢిల్లీ: గూగుల్ కు కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన రూ.1337.76 కోట్ల జరిమానాలో 10 శాతం చెల్లించాలని ది నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీల్యాట్) గూగుల్ను ఆదేశించింది. ఆండ్రాయిడ్ మొబైల్ విభాగంలో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ గతేడాది అక్టోబర్లో గూగుల్కు సీసీఐ రూ.1337.76 కోట్ల జరిమానా విధించింది. అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని సూచించింది. దీనిపై గూగుల్ ఎన్సీల్యాట్ ను ఆశ్రయించింది. పెనాల్టీపై స్టే విధించించాలని కోరింది. అయితే గూగుల్ అప్పీల్ను విచారణకు స్వీకరించిన ఇద్దరు సభ్యుల బెంచ్ .. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఇతరుల వాదనలు కూడా విన్నాక పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సీసీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 13కి వాయిదా వేసింది.
ఆండ్రాయిడ్ వల్ల భారత యూజర్లు, మొబైల్ తయారీ కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయని, భారత డిజిటల్ ప్రయాణంలో ఆండ్రాయిడ్ కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. సీసీఐ ఉత్వర్వులతో ఆ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గూగుల్ ఎన్సీల్యాట్ కు తెలిపింది. దేశంలో ఎలాంటి విచారణా జరపకుండా యూరోపియన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సీసీఐ డైరెక్టర్ జనరల్ కాపీ కొట్టారని తీవ్ర ఆరోపణలు చేసింది. కాబట్టి సీసీఐ ఆదేశాలను కొట్టివేయాలని కోరింది. అయితే, గూగుల్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న ట్రైబ్యునల్.. స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది.