Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
కోతులతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్నది. అబ్దుల్ షేక్ అనే వ్యక్తి తన కారులో పుణె జిల్లా భోర్ నుంచి కొంకణ్ వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వరందా ఘాట్ రోడ్లో ఉన్న వాఘ్జాయ్ గుడి వద్ద కారును ఆపాడు. ఆ ప్రాంతంలో కోతుల గుంపు కనిపించడంతో వాటితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగా వాటితోపాటు తననుకూడా కవర్ చేసుకోవాలనే యత్నంలో కొండ పైనుంచి జారి లోయలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనికోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో లోయలో 500 మీటర్ల దిగువన అతని మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సహాయంతో అతడిని వెళికితీసి దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.