టికెట్ తనిఖీ పేరుతో రైలులోకి ప్రవేశించినయ తనిఖీ అధికారులు (టీసీలు) ప్రయాణికుడి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. సదరు ప్రయాణికుడు రైలులో పై బెర్త్ మీద కూర్చున్నాడు. దీంతో ఇద్దరు టీసీల్లో ఒకరు ప్రయాణికుడి కాలు పట్టుకుని కిందకు లాగేందుకు ప్రయత్నించగా, అతడు రెండు చేతులతో బెర్త్ కు ఉన్న ఐరన్ రాడ్ ను పట్టుకుని బలంగా నిరోధించాడు. దీంతో ఇద్దరు టీసీలు ప్రయాణికుడి కాళ్లను చెరొకరు పట్టుకుని బలమంతా ఉపయోగించి కిందకు ఈడ్చి పడేశారు. అతడు ఒక్కసారిగా కింద పడిపోగా, ఒక టీసీ అతడిని నడుముపై తన్నగా, మరో టీసీ ముఖంపై తన్నాడు. ఈ తరుణంలో దాడి చేసే హక్కు లేదంటూ టీసీలను తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. ఈ ఘటన ముంబై నుంచి జైనగర్ వెళుతున్న రైలులో దోలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 2న అర్ధరాత్రి జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు సమాచారం. దీనిపై రైల్వే శాఖ అధికారి ఒకరు స్పందిస్తూ ఇద్దరు టీసీలను వెంటనే సస్పెండ్ చేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.