Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : గత కొన్ని రోజులుగా దేశంలో ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో గురువారం ఒక్కరోజే ఏకంగా 25 మంది చనిపోయారు. వీరంతా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందినట్లు నివేదికలు వెల్లడించాయి. తీవ్రమైన చలి కారణంగా రక్తపోటు ఒక్కసారిగా పెరిగి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అధ్యాపకుడు మాట్లాడుతూ.. 'చల్లని వాతావరణంలో గుండెపోటు వృద్ధులకు మాత్రమే పరిమితం కాదు. యుక్తవయసులో ఉన్న వారు కూడా గుండెపోటుకు గురైన సందర్భాలు ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వెచ్చటి వాతావరణంలో ఉండాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి' అని తెలిపారు. కార్డియాలజీ ఇనిస్టిట్యూట్ కంట్రోల్ రూం ప్రకారం.. గురువారం ఒక్కరోజే 723 మంది హృద్రోగులు ఎమర్జెన్సీ, ఓపీడీకి వచ్చారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 41 మంది రోగులు ఆస్పత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతున్న ఏడుగురు హృద్రోగులు చలి కారణంగా ఆరోగ్యం విషమించి మృతి చెందారు.