Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మహబూబాబాద్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ తరుణంలో సీఎం మాట్లాడుతూ మహబూబాబాద్ కూడా జిల్లా అయింది. ఇవాళ ఈ కలెక్టరేట్ భవనం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆదివాసీలు, గిరిజన ప్రాంతాల్లోనూ వెలుగులు నిండాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలకు చేరువలో పాలన ఉండాలని భావించాం. రాష్ట్రం ఏర్పడకముందు కేవలం మూడ్నాలుగు మెడికల్ కాలేజీలు ఉండేవి. ఇప్పుడు 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలి. మహబూబాబాద్ వంటి మారుమూల ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందేలా ఈ సందర్భంగా ఓ శుభవార్త చెబుతున్నా. మహబూబాబాద్ లో ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నా. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇక్కడ ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం అవుతుందన్నారు. ఈ క్రమంలోనే నూకల రామ చంద్రరెడ్డి ని గుర్తుచేసుకున్నారు.
మా తండాలో మా రాజ్యం అంటూ ఇక్కడి ప్రజలు 50 ఏళ్లు నినదించినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలు, గిరిజనుల ఆకాంక్షలను గుర్తించి గౌరవించిందని తెలిపారు. ఇవాళ తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని, గిరిజన బిడ్డలే సర్పంచిలై వారి తండాలను బాగుచేసుకున్నారన్నారు.
అలాగే సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నిధి అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిధులతో ఆయా సర్పంచిల ద్వారానే అభివృద్ధి పనులు జరిపించాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, తొర్రూర్, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో వెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. పెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబాబాద్ కు రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి కేటాయిస్తున్నట్టు, ఈ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు.