Authorization
Fri May 16, 2025 10:22:37 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హంసరాజ్ కళాశాల హాస్టల్, క్యాంటీన్లో మాంసాహారాన్ని నిషేధించినట్టు పిన్సిపాల్ ప్రొఫెసర్ రమ తెలిపారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో దాదాపు మూడేండ్ల పాటు కళాశాల హాస్టల్, క్యాంటీన్లు తెరచుకోలేదు. తాజాగా ప్రిన్సిపాల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘ గత మూడు నాలుగేండ్ల కిందటే కళాశాల హాస్టల్, క్యాంటీన్లో మాంసాహారాన్ని నిలిపివేశాం. అయితే, నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులతో ఒక మాట చెప్పి ఉండాల్సింది. ఆ తర్వాత ఆచరణలోకి తీసుకురావాల్సింది. అందుకే మీడియా సమక్షంలో నిర్ణయాన్ని చెబుతున్నాం.’’ అని ఆమె అన్నారు. కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థులు కూడా కట్టుబడి ఉండాలని చెప్పారు.
ఇదే విషయంలో గత ఏడాది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శ్రీరామనవమి రోజున కళాశాల క్యాంటీన్లో లెఫ్ట్ పార్టీ సానుభూతి పరులైన కొందరు విద్యార్థులు మాంసాహార భోజనం తింటుండగా ఏబీవీపీకి చెందిన విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కావేరీ హాస్టల్ వార్డెన్పై కొందరు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే మాంసాహారాన్ని పూర్తిగా నిషేధిస్తూ హంసరాజ్ కళాశాల యాజమాన్యం తాజాగా మరోసారి నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు.