Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అయినా ఎలాంటి స్పందనా లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించిందని చెప్పారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరినప్పటికీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు ఇచ్చామన్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. రుద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. యునెస్కో గుర్తింపు పొందిన ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్లో రామప్ప దేవాలయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు. రామప్ప పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
గిరిజన బిడ్డల కష్టం చూసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని, అందుకే ములుగును జిల్లాగా చేశారని తెలిపారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రూ.137 కోట్లతో ప్రభుత్వం కరకట్టలను నిర్మించిందని వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ కోసం ప్రభుత్వం ములుగు జిల్లాను ఎంచుకోవడం గర్వంగా ఉందన్నారు. న్యూట్రీషన్ కిట్ కోసం జిల్లానే ఎంచుకున్నదని గుర్తుచేశారు. ములుగుకు మెడికల్ కాలేజీ వచ్చిందని, వచ్చే ఏడాది తరగతలు ప్రారంభమవుతాయని చెప్పారు. ములుగు జిల్లా తెలంగాణను ప్రపంచపటంలో నిలిపిందన్నారు.