Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బాసర
చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. విద్య, సంగీతం, కళలకు దేవత అయిన సరస్వతీ దేవి జన్మించిన రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పవిత్రమైన రోజున తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి భక్తులు భారీగా వేచిఉన్నారు. ఈ తరుణంలో ఆలయ పండితులు తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బాసర ఆలయాన్ని విద్యుత్దీపాలతో సుందరీకరించారు. ఆలయ గోపురాలు, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ఆలయం మిరుమిట్లు గొలుపుతున్నది. పలువురు భక్తులు ముందుగానే చేరుకొని ఆలయ ఆవరణలోనే నిద్రించారు. ఉదయం గోదావరిలో పుణ్య స్నానా లు ఆచరించి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.