Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీల కోసం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి అరుణ జీవో నెంబరు 5 జారీ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు ఖాళీల వివరాలను ప్రకటించి.. 28 నుంచి ఈనెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 4వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లను స్వీకరించి పరిష్కరిస్తారు. బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే ఉంటాయని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులను, మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న టీచర్లను దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ చేయనున్నట్టు జీవోలో వెల్లడించారు. మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్న టీచర్లు వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు. బాలికల పాఠశాలల్లో 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులుంటే బదిలీ చేసి.. మహిళలను నియమిస్తారు. ఒక వేళ మహిళా ఉపాధ్యాయులు లేకపోతే 50 ఏళ్లు దాటిన పురుషులను నియమిస్తారు. ఉపాధ్యాయులకు డీఈవో, ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు.