Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కుమారులను చంపిన బీజేపీ మాజీ కార్పొరేటర్, భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లోని విదీషా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విదీషాకు చెందిన 45 ఏళ్ల సంజీవ్ మిశ్రా బీజేపీ మాజీ కార్పొరేటర్. వారి ఇద్దరు కుమారులైన 13 ఏళ్ల అన్మోల్, 7 ఏళ్ల సార్థక్ కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుమారుల అనారోగ్యం గురించి కొంతకాలంగా భార్యాభర్తలు కలత చెందుతున్నారు. దీంతో గురువారం సాయంత్రం సంజీవ్ మిశ్రా, 42 ఏళ్ల భార్య నీలం కఠిన నిర్ణయం తీసుకున్నారు. తొలుత తమ పిల్లలిద్దరిని చంపారు. అనంతరం ఆదంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా, ఈ సంఘటనకు ముందు సంజీవ్ మిశ్రా ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. 'శత్రువుల పిల్లలకైనా ఈ వ్యాధి రాకుండా దేవుడు చూడాలి. నా పిల్లలను నేను కాపాడుకోలేను. ఇక నేను జీవించాలనుకోవడంలేదు' అని అందులో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ చూసిన కొందరు పోలీసులను అలెర్ట్ చేశారు. దీంతో విదీషా సివిల్ లైన్స్ పోలీసులు వెంటనే సంజీవ్ మిశ్రా ఇంటికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న సంజీవ్ మిశ్రా, ఆయన భార్య, ఇద్దరు పిల్లలను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ నలుగురు చనిపోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.