Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అశ్విన్ కుమార్ తమ్ముడు నిర్మల్ చౌబే శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. బిహార్ లోని భగల్పూల్ జిల్లా మయాగంజ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించినట్టు కుటుంబ సన్నిహితులు శనివారం తెలిపారు. అయితే నిర్మల్ చౌబేను చేర్పించిన ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేరని, నర్సులు మాత్రమే ఉన్నారని వారు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నిర్మల్ చౌబే కన్నుమూసినట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మల్ చౌబేకు గుండెపోటు రావడంతో రక్తం కక్కుకున్నారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించాం. రెండు గంటల సేపు ఐసీయూలోనే ఉంచారు. సకాలంలో చికిత్స అందకపోవడంతో కన్నుమూశారు. కేంద్ర మంత్రి సోదరుడనే విషయం ప్రస్తావించినప్పటికీ సిబ్బంది చేసిందేమీ లేదు. కేంద్ర మంత్రి సోదరుడికే ఈ పరిస్థితి వస్తే సామాన్యుడి పరిస్థితి ఏమిటి? అని నిర్మల్ చౌబే బంధువు చందన్ చౌబే వాపోయారు. నిర్మల్ చౌబే మరణించినట్టు వైద్యులు ప్రకటించగానే ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పలువురు మద్దతుదారులు సైతం అక్కడికి చేరుకుని నిరనలకు దిగారు. దీంతో సుమారు రెండు గంటల సేపు ఆందోళన కొనసాగింది. సిటీ ఎస్పీ ఆనంద్ కుమార్తో పాటు చుట్టపక్కలు ఆరు పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది అక్కడకు చేరుకుని చౌబే కుటుంబ సభ్యులను శాంతింపచేశారు.