Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఇంట్లోకి రాత్రివేళ ప్రవేశించి పోటీసులకు పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్కుమార్ రెడ్డి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతి విషయమై మాట్లాడేందుకే స్మితా సభర్వాల్ ఇంటికి వెళ్లినట్టు పోలీసుల విచారణలో ఆనంద్కుమార్ రెడ్డి తెలిపాడు. అయితే, రాత్రివేళ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. 1996 గ్రూప్-2లో ఉమ్మడి రాష్ట్రం నుంచి దాదాపు 26 మంది అభ్యర్థుల పోస్టులు కోర్టు వివాదంలో ఉన్నాయని, వారిలో 18 మందిని ఏపీకి కేటాయించగా, 10 మందికి తెలంగాణలో పోస్టింగులు వచ్చాయని వివరించాడు. వారిలో తాను కూడా ఒకడినని చెప్పుకొచ్చాడు. ఏపీకి వెళ్లిన వారికి పదోన్నతలు వచ్చాయని, కానీ తామింకా డిప్యూటీ తహసీల్దార్లుగానే మిగిలిపోయామని, ఈ విషయం గురించి మాట్లాడేందుకే ఆమె ఇంటికి వెళ్లినట్టు పోలీసులకు వివరించాడు. ప్లజెంట్ వ్యాలీలో స్మితా సభర్వాల్ నివసిస్తున్న ఫ్లాట్లోకి ఈ నెల 19న రాత్రి ఆనంద్కుమార్ రెడ్డి తన స్నేహితుడు కొత్తబాబుతో కలిసి వెళ్లాడు. కొత్తబాబును బయటే ఉంచి లోపలికి వెళ్లిన ఆనంద్కుమార్ను స్మిత ఇంటి బెల్ కొట్టాడు. తలుపు తీసి చూసిన ఆమె కేకలు వేయడంతో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆనంద్కుమార్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైలులో ఉన్నాడు. ఈ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, టీ తాగేందుకు వెళ్దామని తీసుకొచ్చి ఇరికించాడంటూ కొత్తబాబు ఆవేదన వ్యక్తం చేశాడు.