Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తనను తాను దేవుడిగా చెప్పుకునే ఆశారాం బాపును మరో లైంగిక దాడి కేసులో దోషిగా గుజరాత్ కోర్టు సోమవారం నిర్ధారించింది. మంగళవారం శిక్షలు ఖరారు చేయనున్నది. అహ్మదాబాద్ జిల్లా మోటేరాలోని ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సూరత్కు చెందిన మహిళ ఆరోపించింది. పదేళ్ల కిందట ఆమె చేసిన ఫిర్యాదుపై గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. ఆశారాం బాపును దోషిగా నిర్ధారించింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి, భార్య లక్ష్మి, కుమార్తె భారతి, నలుగురు మహిళా అనుచరులు ధ్రువ్బెన్, నిర్మల, జస్సీ, మీరాను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.
కాగా, ఆశారాం బాపు ప్రస్తుతం రాజస్థాన్లోని జోధ్పూర్ జైలులో ఉన్నాడు. 2013లో జోధ్పూర్ ఆశ్రమంలో ఆయన తనపై లైంగికదాడికి పాల్పడినట్లు16 ఏళ్ల బాలిక పోలీసులకు నాడు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఏడాది ఆగస్ట్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న ఆశారాం బాపును పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్లో జోధ్పూర్కు తీసుకొచ్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన జోధ్పూర్ ట్రయల్ కోర్టు 2018లో ఆశారాం బాపును దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. దీంతో నాటి నుంచి ఆయన జోధ్పూర్ కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.