Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు. కాగా, తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో ప్రచారం జరుగుతోందని, అందులో నిజంలేదని బులెటిన్ లో స్పష్టం చేశారు. తారకరత్నకు ఇప్పటివరకు ఎక్మో సపోర్ట్ అందించనేలేదని వివరించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అభిమానులకు సమాచారం అందిస్తున్నారని, తారకరత్న ఆరోగ్యంలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే తప్పకుండా పంచుకుంటామని నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. ప్రజలెవరూ తారకరత్నను చూసేందుకు రావొద్దని, చికిత్సకు అంతరాయం కలగకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. నందమూరి తారకరత్న ఇటీవల కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆయనకు కుప్పంలోని ఆస్పత్రిలో చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.