Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘పీఎం కేర్స్ పేరుతో అత్యవసర సహాయ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీఎం కేర్స్ నిధిని ప్రభుత్వ నిధిగా ప్రకటించాలని కోరుతూ ఢీల్లీ హైకోర్టులో సంయక్ గంగ్వాల్ అనే ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఒక వేళ అది ప్రభుత్వ నిధి కాకుంటే వెబ్సైట్ డొమైన్ పేరులో gov, ప్రధానమంత్రి ఫొటో, కేంద్ర ప్రభుత్వ ముద్రను తొలగించాలని కోర్టుకు తెలిపారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఢీల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా వివరణ ఇచ్చింది. ఇది ప్రభుత్వ నిధి కాదు. పీఎం కేర్స్ కింద సేకరించిన విరాళాలు భారత ఏకీకృత నిధి కి వెళ్లవు. ఇతర ట్రస్టుల మాదిరిగానే ఈ ట్రస్టుకు వచ్చిన నిధుల వినియోగం పూర్తి పారదర్శకంగానే ఉంటుంది ఢీల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది.
ఈ తరుణంలో పీఎం కేర్స్ ఫండ్ని పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్గా పేర్కొంటూ ఢీల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ వివరణపై ట్విటర్ వేదికగా స్పందిస్తూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చిహ్నం, ప్రభుత్వ వెబ్సైట్ని వినియోగిస్తూనే పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎన్డీయే ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందనడానికి ఇదో క్లాసిక్ ఉదాహరణ అని కేటీఆర్ అన్నారు.